Nadendla Manohar : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వాడి వేడిగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, మరోవైపు వైసీపీ నాయకులు కూడా అంతే ధీటుగా బదులిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల వైఎస్ జగన్ విద్యార్ధులకి సంబంధించిన కార్యక్రమంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం పట్ల మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇంగిత జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కేవలం పవన్ ను విమర్శించడానికే రూ.6 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి సభ పెట్టారని అన్నారు. జగన్ రెడ్డికి కాస్త సిగ్గుండాలి.. పాఠశాలల విద్యార్థుల సభలో ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ పై జగన్ ఆరోపణలు చేశారు. పవన్ లారీ ఎక్కితే మీకేంటి? మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా? ఏదో ఒక రోజు మీరు లారీ, కార్లపై తిరగాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా పవన్ పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
![Nadendla Manohar : విద్యార్ధుల కార్యక్రమంలో ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ని విమర్శిస్తారా.. నాదెండ్ల ఫైర్.. Nadendla Manohar counters to cm ys jagan](http://3.0.182.119/wp-content/uploads/2023/07/nadendla-manohar.jpg)
2024లో వైసీపీకి కాలం చెల్లుతుంది అని నాదెండ్ల జోస్యం చెప్పారు. ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది. దానికోసం జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు? తాను ఓడిపోయినా సరే రాజకీయాల నుంచి దూరంగా వెళ్లనని పవన్ చాలాసార్లు చెప్పారు. గత ఎన్నికల ఫలితాల తరువాత నాతో అన్నారు. అది ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమ. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ లాంటి దుర్మార్గపు నాయకులను ఇంటికి పంపించాలి అని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జగన్ వంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.