T20 World Cup 2022 : ఆస్ట్రేలియా వేదికగా అడిలైడ్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2022 రెండో సెమి ఫైనల్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జరిగిన మొదటి సెమిఫైనల్లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలిచి ఫైనల్స్కు చేరుకుంది. దీంతో భారత్ కూడా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఒక వార్త వైరల్గా మారింది. ఈ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 225 పరుగులు చేసి దూకుడు మీదున్న సూర్యకుమార్ యాదవ్ను కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు చెందిన మాజీ బ్యాట్స్మన్ నాసర్ హుస్సేన్ ఒక వ్యక్తిని వాట్సాప్ ద్వారా సంప్రదించాడు.
సూర్యకుమార్ యాదవ్ బలం, బలహీనతలు ఏమిటి..? అని హుస్సేన్ ఆ వ్యక్తిని వాట్సాప్ ద్వారా కోరాడు. అయితే ఆ వ్యక్తి ఇలా రిప్లై ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్కు అన్నీ బలాలే ఉన్నాయి. బలహీనతలు లేవు. అతను మైదానంలో ఏ దిశలో అయినా ఆడగలడు. కనుక మీరు ఏమీ చేయలేరు.. అని సమాధానం ఇచ్చాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ గతంలో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కనుక ఇంగ్లండ్ అతన్ని వీలైనంత త్వరగా ఔట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సూర్యకుమార్ యాదవ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ లో సరిగ్గా ఆడలేడని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం అలాంటి బౌలర్ ఎవరూ లేరు. డాసన్ అనే బౌలర్ ఉన్నాడు. కానీ అతను ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కనుక ఇంగ్లండ్ అతన్ని కేవలం సూర్యకుమార్ యాదవ్ కోసం ఆడిస్తుందని గ్యారెంటీ లేదు. అయితే గతంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్ వంటి బౌలర్లను సూర్యకుమార్ యాదవ్ పరుగులెత్తించాడు. కనుక ఇవాళ్టి మ్యాచ్లో అతను ఎలా ఆడుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది.