Chandra Babu : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా సాగుతుంది. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. బాంబులకే తాను భయపడలేదు…రాళ్లకు భయ పడతానా..? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం నాడు గాజువాకలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై దాడికి ఎవరు బాధ్యులు…? అని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నది నువ్వా….నేనా..? అని నిలదీశారు. కరెంటు పోయిన సమయంలో రాళ్ల దాడి జరిగిందని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. తన మీద, తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేసి… అక్రమ కేసులు పెట్టారని విరుచుకుపడ్డారు. తాను నేరాలు చేసేవాడిని కాదు… నేరగాళ్లను తుంగలో తొక్కేసే సామర్థ్యం ఉన్నవాడినని అన్నారు. ఎవరో జగన్పై గులక రాయి వేశారన్నారు. 24 గంటల అవుతోంది…చర్యలు ఏవీ? అని ప్రశ్నించారు. సీఎస్, డీజీపీకు బాధ్యత లేదా అని నిలదీశారు. తన మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు…ప్రజలు అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

చీకటిలో జగన్పై గులక రాయి వేశారని .. ఇప్పుడు వెలుగులో తనపై రాళ్లు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాళ్ల దాడి చేస్తోంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాళ్లు వేసింది జే గ్యాంగ్ పనేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే విశాఖ పోర్టుకు డ్రగ్స్ దిగుమతి అవ్వలేదా అని ప్రశ్నించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో జగన్ ప్రభుత్వమే దోషి అని విరుచుకుపడ్డారు. డ్రగ్స్ నివారించమని అడిగితే టీడీపీ ఆఫీసుపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. ఆయనది చెత్త పరిపాలన అని ఎద్దేవా చేశారు. తనకు తోడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని.. తమకు ఇద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని తెలిపారు.