Siemens Ex Md Suman Bose : స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ఆరోపణలపై సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పందించారు. ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రాజెక్టు అమలు భేషుగ్గా ఉందని ప్రశంసించిన ఏపీఎస్ఎస్డీసీనే ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.తన జీవితంలో తాను ఎంతో గౌరవం సంపాదించుకున్నానని అన్నారు. ఒక హత్య జరిగితే విచారణ చేస్తారని.. కానీ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచిత్రంగా హత్యకు (స్కామ్) గురైనట్లుగా చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడని అభివర్ణించారు.
బతికుండగానే హత్య (స్కామ్) జరిగిందని విచారణ చేస్తామంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రంలో కంపెనీ విషయమై మీ ముందుకు తెస్తున్నా. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే ప్రాజెక్టు లక్ష్యం. 2014లో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేశంలో 200కు పైగా ల్యాబ్లను ప్రారంభించాం. సీమెన్స్ కంపెనీ, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఒప్పందం ఉంది. ఒక సాప్ట్ వేర్పై యువతకు అవగాహన కల్పిస్తే దానికి డిమాండ్ పెరుగుతుంది. మార్కెటింగ్ లో భాగంగానే ప్రభుత్వం, సీమెన్స్ మధ్య 90:10 ఒప్పందం జరిగింది అని ఆయన అన్నారు. సిమెన్స్ తో అగ్రిమెంట్ జరగలేదు అని సీఐడీ ఆరోపణ అవాస్తవం.
![Siemens Ex Md Suman Bose : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు బోగస్.. సీమెన్స్ మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు.. Siemens Ex Md Suman Bose sensational comments](https://i0.wp.com/telugunews365.com/wp-content/uploads/2023/09/siemens-ex-md.jpg?resize=1200%2C675&ssl=1)
ఏపీఎస్ఎస్డీసీ ప్రభుత్వ సంస్థ కాదా? ఎండీగా నేను, మా కంపెనీ సీఎఫ్ఓ సంతకం చేశాం. ఈ తప్పుడు ఆరోపణలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. తప్పుడు ఆరోపణలు చేయడం సులువు. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు.. నిజం ఎప్పటికి నిజమే. 2021లో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేశాం. ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారు. 2018లోనే ఈ ప్రాజెక్టు నుంచి నేను బయటకు వెళ్లిపోయాను. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీఎస్ఎస్డీసీలో ఏం జరిగిందో నాకు తెలియదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరగలేదు. డిస్కౌంట్స్ లో అవినీతి సాధ్యమని ఎలా చెబుతారు? సీమెన్స్ తో ఒప్పందం జరగలేదనడం పూర్తి అబద్దం. ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. కోర్టుల పరిధిలో ఉన్నందున కోర్టులకు అన్ని విషయాలు చెబుతాం అని ఆయన అన్నారు.