Pawan Kalyan : పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు ఆయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, ఆయన తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షలు జరిపారు. ఏయే ప్రాంతాల్లో అయితే.. వరద నీరు తగ్గుముఖం పట్టిందో అక్కడ.. పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకోవడానికి తాను వ్యక్తిగతంగా కోటి రూపాయలు విరాళం ఇస్తానని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.
తెలంగాణ వరద బాధితులకు కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తానని పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలిసిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. విజయవాడ కలెక్టర్ ఆఫీసు కార్యాలయంలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన గణపతికి పూజలు చేసిన అనంతరం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఇదే సమయంలో విజయవాడ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించారని సమాచారం.

కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మీరు త్వరగా కోలుకొని ప్రజాసేవ చెయ్యాలని సీఎం చంద్రబాబు డీసీఎం పవన్ కల్యాణ్ కు సూచించారని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామాలకు నాలుగు కోట్ల రూపాయల తన వ్యక్తిగత సొమ్ము అందిస్తానని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 400 గ్రామాల అభివృద్ధి కోసం నాలుగు కోట్ల రూపాయలు ఆయా గ్రామాల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.