Undavalli Arun Kumar : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పటికీ ఎన్నికల ఫలితాల పైన ఇంకా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. జగన్ ఓటమి తరువాత పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు..వైసీపీ ప్రతిపక్ష పాత్ర పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లలో మాత్రమే గెలవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ నిస్పృహల్లో మునిగిపోయిన వైసీపీ నాయకుల్లో ఉత్సాహం నింపేలా ఉండవల్లి అరుణ్కుమార్ మాట్లాడారు. సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన రాజకీయ పార్టీల చాప్టర్లు క్లోజ్ కావని అన్నారు.
ఢిల్లీకి చక్రం తిప్పి వచ్చే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఫలితాలతోనే మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు పై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటారని తాను భావిస్తున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్నింటినీ సాధించుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు. ఏపీలో బీజేపీతో కలవకపోయినా టీడీపీ, జనసేన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ముందుగానే ఈ రెండు పార్టీలతో పొత్తు కలుపుకుని మోదీకి మరో అవకాశం దక్కేందుకు కారణమయిందన్నారు. ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరగడం కూడా జగన్ ఓటమికి కారణమన్నారు.
![Undavalli Arun Kumar : ఆ ఒక్క పని చేయకపోతే జగన్ గెలిచేవాడు.. ఉండల్లి సంచలన కామెంట్స్.. Undavalli Arun Kumar told reasons why jagan lost this time](http://3.0.182.119/wp-content/uploads/2024/06/undavalli-arun-kumar.jpg)
అమరావతి, పోలవరంతో పాటు విభజన సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింప చేసేలా ప్రయత్నించాలని ఆయన కోరారు. వైసీపీ 11 స్థానాల్లోనే గెలవచ్చు.. కానీ 2019లో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల కంటే జగన్కు ఎక్కువే వచ్చాయని ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సూచించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించడంలో విఫలమైతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని తెలిపారు.ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. 1989లో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే కరుణానిధి పార్టీకి 169 సీట్లు వచ్చాయని.. జయలలిత పార్టీకి కేవలం 30 సీట్లే వచ్చాయని చెప్పారు. అదే 1991లో ఎన్నికలు జరిగితే జయలలితకు 285 సీట్లు వచ్చాయని.. కరుణానిధికి కేవలం ఏడు సీట్లే వచ్చాయని గుర్తుచేశారు. అప్పుడు కరుణానిధి ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోలేదని.. ప్రతిపక్షంలో ఉండి పోరాడాడని చెప్పారు.