Thummala Nageshwar Rao : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయం చాలా వేడెక్కిపోతుంది. అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయ్. అంతకుమించి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఆదివారం నాడు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొని.. ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్ గురించి కేసీఆర్ మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. పువ్వాడ ప్రత్యర్థి.. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో గులాబీ బాస్ ఫైర్ అయ్యారు.
పువ్వాడ అజయ్ పట్టుబట్టి నాతో రూ.700 కోట్లు మంజూరు చేయించుకున్నాడు.. ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. ఖమ్మం పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని పువ్వాడ అజయ్ భావిస్తున్నాడు.. దయచేసి మరోసారి గెలిపించండి. ఖమ్మంలో ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు లేవు.. ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఖమ్మం ఇప్పుడెంత భద్రంగా ఉందో చూడండి. పువ్వాడ అజయ్ కష్టపడి పనిచేశాడు కాబట్టే ఇంత అభివృద్ధి జరిగింది.. మళ్లీ గెలిపిస్తా ఇంకా అభివృద్ధి చేస్తాడు అని కేసీఆర్ అన్నాడు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలకి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి తుమ్మల ఇంట్లో కూర్చున్నారని… ఆయనను తానే పిలిచి మంత్రి పదవిని ఇచ్చానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తుమ్మల అదే స్థాయిలో ప్రతిస్పందించారు.

కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వడం కాదని… ఆయనకు తానే మంత్రి పదవిని ఇప్పించానని తుమ్మల అన్నారు. గతంలో తనతో పాటు కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నారని… ఆ సమయంలో చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. తొలుత కేసీఆర్ కు చంద్రబాబు అటవీశాఖను ఇచ్చారని… ఆ శాఖ కేసీఆర్ కు ఇష్టం లేకపోతే… తాను బాబుతో మాట్లాడి రవాణాశాఖను ఇప్పించానని తెలిపారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి… చంద్రబాబును అడిగితే నిజం తెలుస్తుందని అన్నారు. తనపై ప్రేమతోనో, ఓడిపోయానన్న జాలితోనో తనను కేసీఆర్ బీఆర్ఎస్ లోకి తీసుకోలేదని తుమ్మల చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జెండా పట్టేవాడు లేకపోవడం వల్లే తనను తీసుకున్నారని అన్నారు. ఖమ్మం ప్రజల కలల సీతారామ ప్రాజెక్టు కోసం మంత్రి పదవి తీసుకున్నానని చెప్పారు. కేసీఆర్ కంటే ముందే మూడు సార్లు మంత్రిగా చేసిన ఘనత తనదని వ్యాఖ్యానించారు.