Sridhar Babu : ప్రస్తుతం అసెంబ్లీలో రాజకీయాలు ఎంత రంజుగా సాగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సభలో కోరం లేదంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోరం లేకుండా సభను పెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హరీశ్ రావు కడియం శ్రీహరి అన్నారు. అయితే, పది శాతం మంది సభ్యులు ఉంటే కోరం సరిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అన్నీ తెలిసినా హరీశ్ రావు బుల్డోజ్ చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ తరపున సరైన సంఖ్యలో సభ్యులు ఉన్నారని చెప్పారు.
తాము పథకాలు అమలు చేయొద్దని బిఆర్ఎస్ వాళ్లు కోరుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై శాసన సభలో చర్చ సందర్భంగా కడియం వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు రాకముందే మరో రెండు పథకాలు అమలు చేస్తామని వివరించారు. బిఆర్ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చిన తరువాత హామీలను అమలు చేస్తామన్నారు. ఇచ్చి ప్రతీ హామీ అమలు చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం చర్చ పెడుదామనని, దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్లు ఎఒయులో కుదుర్చుకున్నామని బాబు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సభ నిర్వహణకు తాము సహకరిస్తున్నామని తెలిపారు. అధికార పార్టీ సభ్యులను తాము అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ… బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం సభలో లేరని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో గోరంతను కొండంత చేయొద్దని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని అన్నారు. కాళేశ్వరం ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయని… నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు.