Sr NTR Food Habits : తెలుగు ప్రజల ఇళ్ళలో ఇలవేల్పుగా, గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్న వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్.. తెలుగు జాతితో అంత ప్రగాఢమైన సాన్నిహిత్యాన్ని పెనవేసుకున్న వారు మరొకరు మనకు కనిపించరు. మొక్కవోని ధైర్యం, మడమ తిప్పని కార్యదక్షత, క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల, అసంభవాన్ని సంభవం చేయగల సమర్థత.. ‘ఒకే ఒక్కడు’గా అటు సినీరంగంలోను, ఇటు రాజకీయరంగంలోను నిలిచారు. పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసినా, నాయక, ప్రతినాయక పాత్రలను పోషించినా, యువకుడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుడి వరకూ ఏ పాత్రలో అయిన ఇట్టే ఇమిడిపోతారు ఎన్టీఆర్.
ఆయన రాముడు, కృష్ణుడు పాత్రలతో పాటు రావణుడి పాత్రలో కూడా సీనియర్ ఎన్టీఆర్ నటించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సమయాన్ని పట్టించుకోకుండా సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువ సినిమాల్లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ మూడు షిఫ్టులలో పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. అనుకోని పరిస్థితి ఎదురయి ఏ రోజన్నా వ్యాయామం చేయకపోతే ఆ రోజంతా నిస్సారంగా, భారంగా గడిచేదని ఆయన చెప్పేవారు.ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి వింటే ఆ అలవాట్లు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన ఆహారపు అలవాట్ల గురించి ఇమండి రామారావు తెలియజేశారు…ఉదయం సమయంలో ఎన్టీఅర్ అరచేతి మందంలో ఉండే 20కు పైగా ఇడ్లీలను సులువుగా తినేవారు. ఉదయాన్నే మేకప్ వేసుకుని ఎన్టీఆర్ నిర్మాతతో కలిసి షూటింగ్ స్పాట్ కు వెళ్లేవారు.

షాట్ గ్యాప్ లో ఆపిల్ జ్యూస్ తాగడానికి సీనియర్ ఎన్టీఆర్ ఇష్టపడేవారు. రోజుకు ఐదు బాటిళ్ల ఆపిల్ జ్యూస్ ను ఎన్టీఆర్ తాగేవారు. సాయంత్రం బజ్జీలు, డ్రై ఫ్రూట్స్ తినడానికి ఎన్టీఆర్ ఇష్టపడేవారు. ప్రతిరోజూ రెండు లీటర్ల బాదంపాలను ఎన్టీఆర్ తాగేవారు. సమ్మర్ లో మాత్రం లంచ్ సమయంలో మామిడికాయల జ్యూస్ తాగేవారు. మామిడి పళ్ల రసంలో గ్లూకోజ్ పౌడర్ కలుపుకుని సీనియర్ ఎన్టీఆర్ తాగేవారు. వైద్యుల సలహా మేరకు కొంతకాలం పాటు అల్లం వెల్లుల్లి ముద్దను సీనియర్ ఎన్టీఆర్ తీసుకునేవారు.ఎన్.టి.ఆర్.కు చికెన్ అంటే చాలా ఇష్టం.
రోజుకు ఒక కోడిని అవలీలగా తినేవారని ఆయన ఆహారపు అలవాట్లు ఎరిగిన వాళ్లు చెప్పేమాట. అలాగే ఆయనకి టీ అంటే చాలా ఇష్టం. రోజులో చాలా సార్లు టీ తాగుతుండేవారు. అయితే తల్లి మరణం తర్వాత టీ తాగడం మానేశారాయన.. చిత్రరంగంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ఖంగుమనే కంఠస్వరం కోసం రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చుట్టలు తాగేవారు. ఆ అలవాటు కూడా క్రమంగా మానుకున్నారు. అలాగే కిళ్లీలు వేసుకునే అలవాటు ఉండేదాయనకి. ఆర్టిస్టులు కిళ్లీలు వేసుకుంటే పళ్లు గారపట్టి అసహ్యంగా కనిపిస్తాయని ఎల్.వి.ప్రసాద్ చెప్పడంతో ఆ అలవాటు కూడా ఎన్.టి.ఆర్. మానుకున్నారు.