RK Roja : ఏపీలో దారుణాతి దారుణంగా ఓడిన తర్వాత రోజా మళ్లీ కనిపించింది లేదు. ఆమె సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలే ఇప్పుడు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు,వజగనన్న తీసుకొచ్చిన వైఎస్సార్ హెల్త్ సెంటర్లే ప్రస్తుతం విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు.
విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.34 మంది వరకూ చనిపోగా.. లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం ఎంతమేర అనేది తెలియాల్సి ఉంది. అయితే బుడమేరు వాగు సాగించిన విలయం నుంచి బెజవాడ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నీటిలో మునిగిన తమ ఇళ్లను శుభ్రపరుచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఫైరింజన్ల సాయంతో వీరి ఇళ్లను క్లీన్ చేయించే పనిలో ఉంది. అలాగే వరదల కారణంగా సర్వం కోల్పోవటంతో తక్షణ సాయంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇక బాధితుల కోసం సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ విరాళాలు అందిస్తుండగా.. సామాన్యులు సైతం తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

అయితే విజయవాడ వరదలు, ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు ఇలా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత రోజా కీలక ట్వీట్ చేశారు. మరోవైపు విజయవాడ వరదలకు మీరంటే మీరు కారణమంటూ అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలే బెజవాడ వాసులను ఈ విపత్తు నుంచి గట్టెక్కిస్తున్నాయని రోజా చెప్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో బుడమేరు వాగు ఆక్రమణకు గురైన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదనేదీ టీడీపీ నేతల వాదన. మరోవైపు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనేదీ వైసీపీ ఆరోపణ. ఇదే సమయంలో వాలంటీర్లు ఉంటే ప్రజలను అప్రమత్తం చేసేవారని.. అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.