Pawan Kalyan : వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారాహి యాత్రంతా కుల, మతాల ప్రస్తావనతోనే సాగిస్తున్న పవన్ కళ్యాణ్ కోనసీమ యాత్రలో మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా గెలుపోటముల గురించి ప్రస్తావించారు. ముమ్మిడివరం సభలో పవన్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఇది 70:30 సర్కారు అన్నారు. వందమంది ప్రజల్లో 70 మంది కష్టపడి సంపాదించిన సొమ్మును వైసీపీ సర్కారు తనకు కావాల్సిన 30 మందికి పంచుతూ ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. కేవలం రాజకీయం కోసం మాత్రమే ప్రభుత్వ పథకాలను వాడుకుంటోందన్నారు.
ఇక ఉప్మాస్టోరీ ఒకటి చెప్పిన పవన్ కళ్యాణ్.. ఓ వసతిగృహంలో రోజువారీ ఉప్మా పెడుతుంటే, అంతా ఎదురు తిరిగారని, మాకు ఉప్మా వద్దని నిరసన వ్యక్తం చేశారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఏం కావాలో ఓటింగ్ పెట్టారని, 18 మంది యధావిధిగా ఉప్మా కావాలని కోరితే, మిగిలిన 82 మంది వివిధ రకాల టిఫిన్ల పేరు చెప్పారన్నారు. అయితే ఉప్మా కోరుకున్న వారి సంఖ్యే అన్నింటి కంటే ఎక్కువ ఉండటంతో మళ్లీ ఉప్మా దిక్కు అయిందన్నారు. వైసీపీ కూడా ఉప్మా తరహా పార్టీనే అని, వైసీపీ వద్దు అనుకుంటున్న వారిలో ఐక్యత అవసరమని టీడీపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
![Pawan Kalyan : ఉప్మా రోజా అంటూ పవన్ కళ్యాణ్ పంచ్లు.. వైసీపీపై తీవ్ర విమర్శలు.. Pawan Kalyan upma comments on roja](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-1-4.jpg)
విపక్షాల్లోని అనైక్యతే వైసీపీకి బలమని పవన్ కళ్యాణ్ చెప్పారు.. అనైక్యతను వీడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే కచ్చితంగా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని పవన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా క్రిమినల్ గ్యాంగ్కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి గెలవడం ఖాయమని, ఒకవేళ ఓడినా బాధపడనంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడినా పట్టించుకోనన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలు చేయడానికి గుండె ధైర్యముంటే చాలన్నారు. తాను మళ్లీ ఓడిపోతానని నిర్ణయించుకునే ఈ ప్రభుత్వంతో గొడవకు దిగానన్నారు పవన్ కళ్యాణ్.