Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి ఎక్కువగా సారించారు.విశాఖపట్నంలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ వేదికగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి మీద పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వెనుక తాను నడవడం లేదన్న పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని అన్నారు. అధికారం కోసం తాను ఓట్లు అడగడం లేదన్న జనసేనాని.. మార్పు కోసం తమను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చినట్లు పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.
దురదృష్టవశాత్తూ 2019లో కుదరలేదన్న జనసేనాని.. 2024లో ఏపీ భవిష్యత్తు కోసమే మరోసారి కలిసివస్తున్నట్లు చెప్పారు. జనసేన నిలబడిన స్థానాల్లో గెలిచి, మద్దతిచ్చిన స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తే జనసేన బలం ఏంటో అందరికీ తెలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. అప్పుడు సీఎం పదవిని అడగగలమని కార్యకర్తలతో చెప్పిన పవన్.. ముఖ్యమంత్రి పదవి గురించి చంద్రబాబు, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జీవితంలో ఇప్పటికే ఎన్నో ఓటములు ఎదుర్కొన్నానన్న పవన్ కళ్యాణ్.. తాను బతికి ఉన్నంతవరకూ జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. ప్రజారాజ్యంలా జనసేన మారబోదన్న జనసేనాని.. మీ అభిమానం ఓట్లుగా మారాలని కార్యకర్తలను కోరారు.
![Pawan Kalyan : జగన్ని ఓ రేంజ్లో ఆడుకున్న పవన్ కళ్యాణ్..! Pawan Kalyan satires on cm ys jagan](http://3.0.182.119/wp-content/uploads/2023/12/pawan-kalyan-2.jpg)
వైసీపీప్రభుత్వం పోలీసులను సమర్థంగా వినియోగించడం లేదనీ.. టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తే పోలీసు శాఖకు పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. సమర్థులైన పోలీసు అధికారులను నియమించి శాంతిభద్రతలు కాపాడుతామని స్పష్టం చేశారు. 151 సీట్లతో వైసీపీని గెలిపించినా ఇప్పటి వరకూ సరైన ఉద్యోగాలు ఇవ్వలేదని.. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత కోసమే తన ఆలోచన, తపన అని చెప్పిన పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయి టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.