Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై సంతకాలు చేశారు. అలాగే పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖలపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు మళ్లించారు? సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదా ఉపాధి వేతనాల చెల్లింపుల్లో జాప్యానికి కారణమేంటి? అంటూ సూటిగా ప్రశ్నించారు.ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీలో ఎందుకు వెనుకబడ్డారు? ఉపాధి కూలీలకు వేతనాల్లో చెల్లింపుల్లో జాప్యానికి కారణం ఎవరని నిలదీశారు. పవన్ నుంచి ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన అధికారులు సరిగా సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ సమయంలో మళ్లీ కలగజేసుకున్న పవన్, తాను లేవనెత్తిన అంశాలపై మరోసారి సమగ్రంగా చర్చిద్దామని, సంసిద్ధులై ఉండాలని సూచించారు.

వివిధ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా పవన్ తనకున్న, అనుమానాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చిందని? సర్పంచులకు వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ లేకపోతే ఎలాగని పవన్ ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు కూర్చోడానికి కుర్చీలూ లేవా అని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ఆడిగారు. అధికారులు స్వేచ్ఛగా, త్రికరణ శుద్ధితో పని చేయొచ్చని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదని, ఎవరైనా జోక్యం చేసుకుంటే చెప్పాలని కోరారు. చెబితే నేర్చుకోడానికి తాను సిద్ధమేనని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పారు.