Pawan Kalyan : ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పవాడు అంటూ పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇక పగిలిన కొద్ది గ్లాసు చాలా పదునెక్కుతుంది. ఈ మాటలన్నీ పవన్ కళ్యాణ్కి బాగా సెట్ అవుతాయి. హీరోగా ఉన్నప్పుడు పవన్ వైపు ఒక్కరు కూడా వేలు చూపలేదు. రాజకీయాలలోకి వచ్చాక మాత్రం నాలుగు పెళ్లిళ్లు అంటూ హేళనలు, రెండుచోట్లా ఓడిపోయాడంటూ అవహేళనలు.. చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురుచూసిన నేతలు కూడా తనను విమర్ళించే పరిస్థితి. కాని అన్ని విమర్శలు కూడా ఓపికగా బిగపట్టి ఈ రోజు ఏపీలో కూటమి అఖండ విజయం సాధించేందుకు ప్రధాన కారకుడు అయ్యాడు.
చంద్రబాబు అనుభవం.. పవన్ కళ్యాణ్ త్యాగం ఈ సారి కూటమి విజయానికి ప్రధాన కారణాలు అయ్యాయి .. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు.. ఆయనకు ఎందుకు రాజకీయాలలోకి వచ్చారని అన్నారు. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడంటూ అధికార పార్టీలోని ఛోటామోటా నేత నుంచి సీఎం వరకూ విమర్శలు చేశారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు.. కానీ ఆయన కుంగిపోలేదు.. చివరకు 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ సొంత సామాజిక వర్గ నేతల నుంచే ఎత్తిపొడుపు మాటలు. అన్నీ భరించాడు.అదును చూసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్.. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్.. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి.. పొత్తు ప్రకటించారు.

ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టుకట్టిన పవన్ కళ్యాణ్.. బీజేపీని కూడా కూటమిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ.. టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. పొత్తు కుదిరినప్పటికీ.. సీట్ల కేటాయింపులో చిక్కులు తలెత్తాయి. దీంతో రాష్ట్ర అవసరాల కోసం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గక తప్పలేదు. చివరకు జనసేన సీట్లను సైతం బీజేపీకి త్యాగం చేసి.. కూటమి నిలబడటానికి కారణమయ్యారు. 23 సీట్లని ముందు చెప్పగా ఆ తర్వాత బీజేపీ మరిన్ని స్థానాలు కావాలని అడగడంతో రెండు ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి ఇచ్చాడు.. చివరకు నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా వదులుకున్నారు.గెలిస్తే రెండున్నరేళ్లు సీఎం పదవిని అడగాలంటూ కొందరు ఆయనకి సూచనలు చేసిన రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అనుభవం అవసరం అంటూ.. తాను తగ్గి కూటమి విజయానికి బాటలు వేశారు. చరిత్రలో మిగిలిపోయారు.