Pawan Kalyan : దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం రిసార్ట్స్లో ఆదివారం రాత్రి వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. రాధాకృష్ణ భార్య పుష్పవల్లి నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె అనే విషయం తెలిసిందే. వీరి వివాహానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పెళ్ళికి హాజరై సందడి చేశారు. తన వివాహ వేడుకకు హాజరైన పవన్ను.. రాధాకృష్ణ సాదరంగా ఆహ్వానించాడు.
నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కొద్దిసేపు రాధాతో ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫోటోలను జనసేన తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారిన వంగవీటి రాధా, పుష్పవల్లీ వివాహానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు, నేతలు తరలివచ్చారు. దాంతో భారీగా తొక్కిసలాట, తోపులాట చోటు చేసుకొన్నది. వేదికపైకి అందరూ ఒకేసారి రావడంతో కొంత గందరగోళం నెలకొన్నది. జనాన్ని కంట్రోల్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్, గన్మెన్లకు కష్టంగా మారింది.

రాధాకృష్ణ వివాహం తర్వాత వధూవరులను ఆశీర్వదించేందుకు పవన్ కల్యాణ్ స్టేజ్పైకి వెళ్లినప్పుడు… ఆయనతోపాటు నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారు. అయితే అదే సమయంలో పవర్ స్టార్ వెనుక ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీకి చుక్కలు కనిపించాయి. పవన్ కల్యాణ్ రావడంతో అభిమానులు, పెళ్లికి వచ్చిన జనం ఒక్కసారిగా స్టేజ్పైకి వచ్చారు. దాంతో పవన్ అభిమానులు కొడాలి నాని, వంశీని వెనక్కి తోశారు. దాంతో వారిద్దరూ కిందపడినంత పనైంది. గన్మెన్లు ఆసరాగా నిలవడంతో తొక్కిసలాట జరగకుండా పెద్ద ప్రమాదమే తప్పింది అని అంటున్నారు.